జీఎస్టీ మండలి సమావేశం డిసెంబర్ 18, బుధవారం నాడు జరగనుంది. జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో 6 శాతం పెరిగి మూడు నెలల తర్వాత 1.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం కోసం పన్నులను పెంచాలని జీఎస్టీ మండలి భావిస్తునట్టు తెలుస్తుంది. కొన్ని వస్తువులపై పన్ను శ్లాబులను పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈసారి జరిగే జీఎస్టీ మండలి భేటీలో వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పలు రాష్ర్టాలకు జీఎస్టీ నష్టపరిహారం బకాయిలు చెల్లించే విషయంలో కేంద్రప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ సమావేశంలో ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ.50వేల కోట్ల మేరకు చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. సోమవారం బీజేపీ పాలనేతర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించి, జీఎస్టీ మండలి భేటీలో వాటిని లేవనెత్తాలని చూస్తున్నారు. మరో వైపు దేశంలో జీడీపీ శాతం క్షిణిస్తుండడంతో తగ్గే ప్రభుత్వ ఆదాయాన్ని జీఎస్టీ రేట్ల పెంపుతో పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. గతంలో జీఎస్టీ నుంచి పన్ను మినహాయింపును పొందిన వాటిపై, మరియు ఇంతవరకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురాని కొన్ని ఉత్పత్తులపై పన్ను వేసే విధంగా జీఎస్టీ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది.
[subscribe]