మహారాష్ట్ర రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జిల్లాలలోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ క్రమంలో రాయ్గఢ్ జిల్లాలోని తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమునట్టు తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది, ఇతర రెస్క్యూ టీమ్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ, అనేక చోట్ల రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, ఇంకా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తరలించి, సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. మరోవైపు కొల్హాపూర్ జిల్లాలో, రత్నగిరి జిల్లాలోని చిప్లున్ లో కూడా వరదలు కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మహారాష్ట్రలోని రాయ్గడ్ లో కొండచరియలు విరిగిపడటంతో పలువురు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, బాధితులకు సహాయం అందిస్తున్నామని చెప్పారు. కొండచరియలు విరిగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షలు చొప్పున ఎక్స్-గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. గాయపడిన వారికి 50,000 రూపాయలు అందించనున్నట్టు తెలిపారు.
రాయ్గడ్లో జరిగిన ప్రమాదం విచారకరమని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ ప్రమాదంపై సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్డీఆర్ఎఫ్ డిజి ఎస్ఎన్ ప్రధాన్ తో మాట్లాడానని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని, కేంద్రం అక్కడ అన్నిరకాలుగా సహాయాన్ని అందిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ