రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సాదించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేగవంతమైన నిర్ణయాలను, సత్వర చర్యలను చేపట్టిందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జూలై 25, 2021న పారిస్ నగరంలో జరగబోయే ప్రపంచ వారసత్వ కమిటీ సభ్యులందరి సమ్మతి పొందేవిధంగా చర్యలను తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అందులో భాగంగా రామప్ప పరిసర ప్రాంతాలలోని ప్రాచీన కట్టడాల పరిరక్షణ ప్రణాళిక, పర్యాటక అభివృద్ధి వంటి అంశాల సక్రమ అమలు కోసం రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేంద్ర పురావస్తు శాఖ, దేవాదాయశాఖ, నగర ప్రణాళిక, నీటిపారుదల శాఖల అధికారులు సభ్యులతో ఉన్న కమిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి అధ్యక్షులుగా వ్యవహరిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
రామప్ప దేవాలయ పరిసరాలలోని రామప్ప చెరువు, కొండలు, అటవీ భూముల ప్రశాంతతను, సౌందర్యాన్ని, పవిత్రతను కాపాడటం కోసం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు నగర అభివృద్ధి శాఖ వారు పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థను కూడా ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ సారథ్యంలో నిర్వహించబడే ఈ సంస్థలో పర్యాటకం, నగర ప్రణాళిక, దేవాలయ, వ్యవసాయం, అటవీశాఖ, నీటిపారుదల శాఖ మరియు స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ రామప్ప దేవాలయం పరిసరాలలోని భూములను నైవాశిక, వాణిజ్య, వ్యవసాయ, అటవీ, నీటిపారుదల ప్రాంతాలుగా విభజించి ఈప్రాంత క్రమబద్ద వికాసానికి కృషి చేస్తుందని తెలిపారు.
ఐసీఓఎంఓఎస్ (అంతర్జాతీయ చారిత్రక కట్టడాలు, ప్రదేశాల మండలి) రామప్పకు వారసత్వ హోదాను మూల్యాంకనం చేసి కొన్ని సూచనలు చేసిందన్నారు. రామప్ప దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్న రెండు చిన్న దేవాలయాలను కూడా రామప్ప దేవాలయ పరిధిలోకి తీసుకోవాలని సూచించిందన్నారు. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్ జూలై 21న రెండు చిన్న దేవాలయాలు ఉన్న భూమిని రామప్ప దేవాలయానికి అందజేస్తూ అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు. దీనివల్ల భారతీయ పురావస్తు సర్వేక్షణ సంస్థ వారు రామప్ప దేవాలయ సరిహద్దులను ఐసీఓఎంఓఎస్ సూచనలకు అనుగుణంగా మార్పులు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సాధించే రక్షక చర్యల వివరాలను అన్నింటిని యూనెస్కోలోని భారత రాయబారి శాశ్వత ప్రతినిధికి ఇదివరకే పంపడం జరిగిందన్నారు. దీనిపై భారత రాయబారి శాశ్వత ప్రతినిధి యునెస్కోలో రామప్పకు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు సాధించడానికి కావాల్సిన అన్ని రకాల వాదనలను వినిపించడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాస రాజు, మాజీ ప్రభుత్వ సలహాదారు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు పాపారావు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ