భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ల తేదీలు రీ-షెడ్యూల్ చేసే అవకాశముంది. శ్రీలంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ముందుగా జూలై 13 నుంచి ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్, జూలై 17 లేదా 18 నుంచి ప్రారంభమయ్యేలా రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తుంది. శనివారం నాడు కొత్త షెడ్యూల్ ను అధికారకంగా ప్రకటించే అవకాశముంది. శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ మరియు జట్టు డేటా అనలిస్టు నిరోషన్ కరోనా బారినపడడంతో ఆ జట్టు ఆటగాళ్లంతా ఇప్పుడు క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని శ్రీలంక చేరుకున్న జట్టు బృందానికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా, శ్రీలంక క్రికెట్ చైర్మన్ షమ్మీ షిరాజ్ సిల్వాతో మాట్లాడి, అక్కడి పరిస్థితులు, ఆటగాళ్ల ఆరోగ్య భద్రత చర్చించినట్టు తెలుస్తుంది.
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 13, 16, 18 తేదీల్లో 3 వన్డేలు, అలాగే 21, 23, 25 తేదీల్లో 3 టీ20లు భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సి ఉంది. కాగా ప్రస్తుత పరిస్థితుల అనంతరం శ్రీలంక వన్డే జట్టు, రీ-షెడ్యూల్ పై ప్రకటించాల్సి ఉంది. మరోవైపు భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ టూర్లో ఉన్న నేపథ్యంలో ఈ వన్డే, టీ20 సిరీస్ లకు యువకులతో కూడిన జట్టును అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించగా, బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ సిరీస్ లో అన్ని మ్యాచ్లు కొలంబోలోని ఆర్ ప్రేమదాసా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే జరుగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ