కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రయాణికులతో నడిచే విమానాలు, రైళ్లు, బస్సులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించింది. దీంతో మే 12వ తేదీ నుంచి క్రమంగా ప్రయాణీకుల రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. మొదటి దశలో ఢిల్లీ నుంచి ప్రముఖ నగరాలకు 15 జతల రైళ్ళు(తిరుగు ప్రయాణాలతో కలిపి 30) నడపనున్నారు. ఈ రైళ్లు న్యూ ఢిల్లీ స్టేషన్ నుండి దిబ్రూఘడ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావీలను కలుపుతూ ప్రత్యేకంగా నడవనున్నాయి.
అనంతరం మరి కొన్ని కొత్త మార్గాల్లో భారతీయ రైల్వే ప్రత్యేక సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. అయితే 20,000 కోచ్లను కోవిడ్ -19 కేర్ సెంటర్లుగా మార్చారు. దీంతో అందుబాటులో ఉన్న కోచ్లను బట్టి మిగతా రైళ్లను నడపనున్నారు. అలాగే వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులకోసం, ప్రతిరోజూ 300 రైళ్ల వరకు శ్రామిక్ స్పెషల్స్ రైళ్లను నడపడానికి వీలుగా తగిన సంఖ్యలో కోచ్లు రిజర్వు చేశారు. ఇక ఈ 30 ప్రయాణికుల రైళ్లలో రిజర్వేషన్ల కోసం టి్క్కెట్ల బుకింగ్ మే 11 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈసదుపాయం ఐఆర్సిటిసి వెబ్సైట్లో (https://www.irctc.co.in/) మాత్రమే అందుబాటులో ఉంటుంది.
రైల్వే స్టేషన్లలో అన్ని టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసివేస్తామని, కౌంటర్ టిక్కెట్లు (ప్లాట్ఫాం టికెట్లతో సహా) ఏవీ జారీ చేయబడవని ప్రకటించారు. చెల్లుబాటు అయ్యే ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతించనున్నారు. ప్రయాణీకులు ఫేస్ కవర్ ధరించడం, బయలుదేరేటప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడం తప్పనిసరి చేశారు. కోవిడ్ -19 లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ఎక్కడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. రైలు షెడ్యూల్తో సహా మరిన్ని వివరాలును నిర్ణీత సమయంలో విడిగా ప్రకటిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu