టోర్నీలో అడుగు పెట్టిన తొలి ఏడాదే అద్వితీయ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15వ సీజన్ టైటిల్ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించి ఐపీఎల్ చరిత్రలో ఏడవ చాంపియన్గా అవతరించింది. అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు తొలి టైటిల్ అందించాడు. కాగా మ్యాచ్ కు ముందు నిర్వహించిన ఐపీఎల్ ముగింపు వేడుకల్లో భాగంగా.. బీసీసీఐ రూపొందించిన అతిపెద్ద జెర్సీ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. టోర్నీలో మొత్తం పది జట్ల లోగోలతో పాటు ‘ఐపీఎల్ 15వ సీజన్’ అనే అక్షరాలతో 66 మీటర్ల పొడవు, 42 మీటర్ల వెడల్పుతో ఈ జెర్సీని రూపొందించారు. టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ రూ. 20 కోట్లు ప్రైజ్మనీ గెలుచుకోగా, రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ రూ. 13 కోట్లు గెలుచుకుంది.
తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో గుజరాత్ చివరి వరకూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పూర్తి సాధికారత ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఈ సీజన్లో నాలుగు శతకాలతో జోరు మీదున్న స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ 35 బంతుల్లో 39 (5 ఫోర్లు) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో బ్యాటర్ యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో.. కెప్టెన్ సంజూ శాంసన్ 14 పరుగులు, హెట్మైర్ 11 పరుగులు, పరాగ్ 15 పరుగులు మాత్రమే చేయగలిగారు. దేవదత్ పడిక్కల్ కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో చెలరేగగా.. సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. వృద్ధిమాన్ సాహా 5 పరుగులు, మాథ్యూ వేడ్ 8 పరుగులు చేసి త్వరగా అవుట్ అయ్యారు. అయితే, శుభ్మన్ గిల్ 45 పరుగులు (3 ఫోర్లు, ఒక సిక్సర్) చేసి చివరి వరకు నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా 34 పరుగులు (3 ఫోర్లు, ఒక సిక్సర్), అనంతరం డెత్ ఓవర్లలో డేవిడ్ మిల్లర్ 32 పరుగులతో నాటౌట్గా నిలిచి (3 ఫోర్లు, ఒక సిక్సర్), మంచి సహకారం అందించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా మొదట బౌలింగ్, ఆపై బ్యాటింగ్లో అదరగొట్టిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరియు బోర్డు కార్యదర్శి జై షా ట్రోఫీ ప్రదానం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF