క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. మండుటెండల్లో వారిని పరుగుల జడివానలో ముంచేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. నేటినుంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ప్రారంభం అవుతోంది. శుక్రవారం ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. దీనికి గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఇక గతేడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ సారథ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో స్టేడియంలో అన్ని జట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. గాయం కారణంగా రోహిత్ ట్రోఫీతో కెప్టెన్ల కార్యక్రమంలో పాల్గొనలేదని సమాచారం. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ స్థానంలో భువనేశ్వర్ పాల్గొన్నాడు.
ఇక ఈ ఏడాది చివర్లో భారత్లోనే జరిగే వన్డే ప్రపంచకప్ మెగా టోర్నీకి ముందు జరుగుతున్న మెగా ఈవెంట్ ఇదే కావడం విశేషం. కాగా దాదాపు 60 రోజులు పాటు జరుగనున్న ఈ టోర్నమెంటులో పది ఫ్రాంచైజీలు 12 వేదికల్లో మొత్తం 74 మ్యాచ్లు ఆడనున్నాయి. పది జట్లను రెండు భాగాలుగా చేసి మ్యాచ్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతీ జట్టు తమ గ్రూపులోని నాలుగు జట్లతో ఒక్కోసారి, అవతలి గ్రూప్లోని అయిదు జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. ప్రతీ టీమ్ సొంత గడ్డపై 7, ప్రత్యర్థి మైదానాల్లో మరో 7 మ్యాచ్లు ఆడతాయి. గ్రూప్ ఎలో ముంబై, కోల్కతా, రాజస్థాన్, ఢిల్లీ, లఖ్నవూ జట్లు ఉండగా.. గ్రూప్ బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లు ఉన్నాయి. ఇక ఆటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆయా కెప్టెన్లు మైదానంలో ఉన్న ఆటగాడికి బదులు ఇంపాక్ట్ ఆటగాడిని దించవచ్చు.
దీంతో పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందనుకుంటే.. బ్యాటర్ను మార్చి ఆ స్థానంలో ఒక స్పిన్నర్ను తీసుకోవచ్చు. అలాగే ఛేదనలో ఎక్స్ట్రా బ్యాటర్ అవసరమనుకుంటే ఎవరైనా ఒక బౌలర్ను తప్పించి మరో బ్యాటర్ను ఆడించవచ్చు. కానీ తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లుంటే మాత్రం భారత ఆటగాడే ఇంపాక్ట్ ప్లేయర్గా రావాల్సి ఉంటుంది. కాగా టాస్ సమయంలో తుది జట్టుతో పాటు నలుగురు సబ్స్టిట్యూట్స్ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఈసారి టాస్ వేశాక కూడా తుది జట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించడం గమనార్హం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సీజన్ నుంచి నోబాల్, వైడ్స్ పై కూడా రివ్యూను కోరవచ్చు. ఇటీవలే నిర్వహించిన డబ్ల్యూపీఎల్లో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశారు. ఇక విజేతకు రూ. 20 కోట్లు ప్రైజ్మనీ నిర్ణయించగా.. రన్నరప్ జట్టుకు రూ. 13 కోట్లు, ప్లే ఆఫ్ చేరుకున్న మిగిలిన 2 జట్లకు చెరో రూ. 7 కోట్లు అందించనున్నారు. నేటి ప్రారంభ మ్యాచ్ రాత్రి 7:30కి ప్రారంభం కానుంది.
ప్రారంభ మ్యాచ్లో జట్లు అంచనా..
గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శివమ్ మావి, మహమ్మద్ షమీ.
చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివం దూబే, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, మతీషా పతిరన.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE