జమ్ముకశ్మీర్లో ఏడాది కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) హతమార్చిందని, మరో 183 మంది ఉగ్రవాదులను బంధించిందని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ గురువారం మీడియాకు వెల్లడించారు. మార్చి 1, 2021 మరియు మార్చి 16, 2022 మధ్య కాలంలో సీఆర్పీఎఫ్ ఈ అరుదైన రికార్డు సాధించిందని జనరల్ కుల్దీప్ సింగ్ గురువారం తెలిపారు. 2021-22లో 1,500 మంది ఉగ్రవాదులు మరియు మావోయిస్టులను అరెస్టు చేశారని, మరో 750 మందిని లొంగిపోయేలా చేశారని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనలలో సీఆర్పీఎఫ్ కు చెందిన 12 మంది సిబ్బంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు, ఇంకో 169 మంది గాయపడ్డారు అని కుల్దీప్ సింగ్ తెలిపారు. వీఐపీ సెక్యూరిటీ వింగ్లో 32 మంది మహిళా సిబ్బందిని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా 41 మంది వీఐపీల భద్రతను సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో పర్యవేక్షించినట్లు, అలాగే ఎన్నికల తదనంతరం 27 మందికి భద్రతను ఉపసంహరించినట్లు చెప్పారు.
దేశంలోని వివిధ ప్రదేశాలలో యాన్యువల్ డే కవాతులను నిర్వహించాలని, ప్రజలకు బలాన్ని ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం వివిధ దళాలను ఆదేశించింది. ఇది సిబ్బందితో పాటు పౌరులకు, ముఖ్యంగా యువతకు ప్రేరణగా పనిచేస్తుంది. ఇది జాతీయ సమైక్యతలో కూడా సహాయపడుతుంది అని సింగ్ అన్నారు. 19న (శనివారం) జమ్మూలోని ఎంఏ స్టేడియంలో సీఆర్పీఎఫ్ 83వ రైజింగ్ డే పరేడ్ను నిర్వహించనున్నారు. ఈ వేడుకను ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి అని సింగ్ పేర్కొన్నారు. కాగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి అందించే పరిహారాన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచినట్లు డీజీ తెలిపారు. ఇంకా ఇతర కేసుల్లో ఎక్స్గ్రేషియాను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు డీజీ కుల్దీప్ సింగ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ