ప్రముఖ కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను కుటుంబసభ్యులు వెంటనే బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ముందుగా వైద్యుల బృందం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు. విక్రమ్ ఆసుపత్రి వైద్య బృందం స్పందిస్తూ, ఉదయం 11:40 గంటలకు పునీత్ రాజ్కుమార్ను అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. అతనిలో స్పందన లేదు మరియు కార్డియాక్ అసిస్టోల్ పరిస్థితిలో ఉన్నారు. వెంటనే ఆయనకు అడ్వాన్స్డ్ కార్డియాక్ రిససిటేషన్ ప్రారంభించామని చెప్పారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా వైద్యులు వెల్లడించారు.
కన్నడ సినీ దిగ్గజం రాజ్ కుమార్ మరియు పార్వతమ్మల ఐదో సంతానంగా మార్చి 17, 1975న పునీత్ రాజ్ కుమార్ జన్మించారు. ముందుగా ఆయన బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. కాగా 2002లో వచ్చిన అప్పు సినిమాతో హీరోగా తన కెరీర్ ప్రారంభించారు. అనతికాలంలోనే కన్నడ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని, స్టార్ హీరోగా ఎదిగారు. తన నటన, డాన్స్ లతో యువతలో ఎనలేని క్రేజ్ సాధించారు. అభిమానులు ఆయన్ను అప్పు, పవర్స్టార్ అని పిలుస్తారు. పునీత్ నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా డబ్ కావడంతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. నటుడుగా, నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నిర్మాతగా కూడా రాణించారు. హీరోగా 29 చిత్రాలలో నటించగా, బాలనటుడిగా చాలా చిత్రాలలో కనిపించారు. బెట్టాడ హూవులో రాముడి పాత్రకు పునీత్ ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.
అలాగే అప్పు, అభి, వీర కన్నడిగ, మౌర్య, ఆకాష్, అజయ్, అరసు, మిలనా, వంశీ, రామ్, జాకీ, హుడుగారు, రాజకుమార మరియు అంజనీ పుత్ర వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. కన్నడ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా పునీత్ రాజ్ కుమార్ ఎదిగారు. కన్నడ కోట్యాధిపతి అనే టెలివిజన్ గేమ్ షోలో వ్యాఖ్యాతగా కూడా చేశారు. పునీత్ రాజ్ కుమార్ అకాలమరణంతో కోట్లాది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల పలు సినీరంగాల ప్రముఖులు, తోటి కన్నడ నటీనటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో పోలీస్ బందోబస్త్ పెంచారు. అలాగే రాష్ట్రంలో రెండు రోజులపాటుగా థియేటర్లు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ