కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 28, బుధవారం నాడు కేరళలో 22,056 కరోనా కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి. రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వీకెండ్ కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. జూలై 31, శనివారం మరియు ఆగస్టు 1, ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయనున్నారు.
మరోవైపు కేరళలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో సమర్థవంతమైన ప్రజారోగ్య చర్యలను ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ఆరోగ్య అధికారులతో సహకరించడానికి కేరళకు ఉన్నతస్థాయి కేంద్ర బృందాన్ని పంపించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కేరళకు వెళ్లే 6 గురు సభ్యుల కేంద్ర బృందానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె.సింగ్ నాయకత్వం వహించనున్నారు. ఈ బృందం జూలై 30న కేరళకు చేరుకుని కొన్ని జిల్లాల్లో పర్యటించనుంది. ఈ బృందం రాష్ట్ర ఆరోగ్య విభాగాలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేసి కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన చర్యలను సిఫారసు చేయనుంది.
మరోవైపు కేరళలో ఇప్పటివరకు మొత్తం 33,27,301 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 31,60,804 మంది కరోనా నుంచి కోలుకోగా, 16,458 మంది మరణించారు. ప్రస్తుతం 1,49,531 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత కేరళ రెండో స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ