కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు అందాయి. ఈ మేరకు లోక్సభ హౌసింగ్ కమిటీ సోమవారం రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది. అయితే ఇందుకు 30 రోజుల సమయం ఇచ్చిన కమిటీ, ఏప్రిల్ 22లోగా బంగ్లాను ఖాళీ చేయాలని కోరింది. అయితే రాహుల్ని ఇల్లు ఖాళీ చేయమనడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ నసీర్ హుస్సేన్ దీనిపై మాట్లాడుతూ.. నిరసనను తొక్కి పెట్టడానికి బీజేపీ అన్ని రకాల ఆయుధాలను వాడుతోందని చెప్పారు. అయినా ఒక ఎంపీకి సభ్వత్వం కోల్పోయిన తర్వాత అధికార నివాసాన్ని ఖాళీ చేసేందుకు 3 నుంచి 6 నెలల సమయం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే జడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో ఉన్న రాహుల్ గాంధీకి ప్రభుత్వ నివాసం పొందే హక్కు ఉన్న రీత్యా హౌసింగ్ కమిటీ నోటీసు సాంకేతికమేనని నిపుణులు భావిస్తున్నారు. ఇక లోక్సభ ఎంపీల హౌసింగ్కు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే ఈ కమిటీకి గుజరాత్ బీజేపీ చీఫ్, ఎంపీ సీఆర్ పాటిల్ అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం.
కాగా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్సభ సచివాలయం ఆయనను ఎంపీ పదవిపై అనర్హత ప్రకటించడంతో లోక్సభ సభ్యత్వం కోల్పోయారు. దీంతో పార్లమెంట్ నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడిన లోక్సభ సభ్యుడు ప్రభుత్వం కల్పించిన వసతి సౌకర్యాన్ని వీడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాహుల్కు ప్రభుత్వం కేటాయించిన బంగళాను ఖాళీ చేయాలంటూ లోక్సభ హౌసింగ్ కమిటీ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తుగ్లక్ లేన్లోని 12వ బంగళాలో 2005 నుంచి ఉంటున్నారు. రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి లోక్సభ ఎంపీగా 2004లో మొదటిసారి ఎన్నికైన తర్వాత ఈ ఆయనకు బంగళా కేటాయించారు. కాగా గత 2019లో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలుపొందిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE