సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహణకు పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహణ, ఏర్పాట్లపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్, డీఆర్డీవో, ఎయిమ్స్, ఢిల్లీ ప్రభుత్వ వర్గాలతో స్పీకర్ ఓం బిర్లా పలు అంశాలపై చర్చించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ, పార్లమెంట్ సమావేశాలకు కనీసం 72 గంటల ముందు ప్రతి పార్లమెంట్ సభ్యుడు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఎంపీలతో పాటుగా పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించే వారికీ, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, లోక్సభ, రాజ్యసభ కార్యదర్శులు, సిబ్బందికి కూడా సమావేశాల ప్రారంభానికి ముందు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కోసం ఉభయసభల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా భౌతిక దూర నిబంధనలు అనుసరించి సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు. అలాగే ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో సమావేశాలు నిర్వహించాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu