సెప్టెంబర్ 14, సోమవారం ఉదయం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు 18 రోజుల పాటు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నాయి. ఈసారి శని, ఆదివారాల్లో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక తొలిసారిగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉభయ సభల ఎంపీలు అందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే సభలో అన్ని జాగ్రత్తలతో, కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. భారత పార్లమెంటు చరిత్రలో సమావేశాల నిర్వహణకు రాజ్యసభ, లోక్ సభ ను కలపడం ఇదే తొలిసారి. భౌతిక దూర నిబంధనలను అనుసరించి సభ్యులకు సీట్లు కేటాయించారు. సమావేశాలలో భాగంగా మొదటి రోజు ఉదయం లోక్ సభ జరగనుండగా మధ్యాహ్నం నుంచి రాజ్యసభ ప్రారంభం కానుంది. ఇక సెప్టెంబర్ 15 నుంచి ఉదయం 11 గంటలకు రాజ్యసభ, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి.
ఉదయం లోక్ సభ ప్రారంభమయ్యాక స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు కీలక సూచనలు చేశారు. అదేవిధంగా ఇటీవల మరణించిన భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి, సిట్టింగ్ ఎంపీ వసంత్కుమార్ కు, మరికొందరు మాజీ పార్లమెంట్ సభ్యులకు సభలో సంతాపం తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సభ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు, సభ్యుల సహకారం మొదలైన అంశాలపై కీలక ప్రసంగం చేశారు. 45 బిల్లులు, 2 ఆర్థిక విషయాలు సహా మొత్తం 47 అంశాలను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu