జమ్మూకాశ్మీర్ లో డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. ముందుగా జూన్ 27, ఆదివారం నాడు జమ్మూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) స్థావరంలోకి డ్రోన్లు ప్రవేశించి బాంబులు జారవిడిచాయి. ఈ పేలుళ్లలో ఏ విమానానికి గాని, పరికరాలకు గాని ఎటువంటి నష్టం జరగలేదని ఐఏఎఫ్ పేర్కొంది. ఒక బాంబు పేలుడుతో భవనం పైకప్పుకు స్వల్పంగా నష్టం జరగగా, మరొకటి బహిరంగ ప్రదేశంలో పేలిందని, ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాగా భారత స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగడం ఇదే తొలిసారి. ఈ డ్రోన్ల దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ దాడి ఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇక జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా సంస్థలు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఈ డ్రోన్ దాడిలో పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఇటి) హస్తం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు ఐఏఎఫ్ స్థావరం డ్రోన్ల దాడి అనంతరం రత్నచక్, కాలుచుక్ సైనిక ప్రాంతాల్లో రెండు డ్రోన్ల కదలికలను గుర్తించిన సైన్యం అప్రమత్తమై కాల్పులు జరిపింది. ఇక బుధవారం కూడా జమ్మూ కాశ్మీర్ లోని సైనిక స్థావరాల సమీపంలో మరో మూడు డ్రోన్లను భద్రతా సిబ్బంది గుర్తించినట్టు తెలుస్తుంది. ఇలా వరుస డ్రోన్ల కదలికలతో భద్రతను మరింతగా కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నేతృత్వంలో డ్రోన్ పర్యవేక్షణ మరియు జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే జమ్మూలోని భద్రతా దళాల యొక్క అన్ని కీలకమైన స్థావరాలలో కూడా యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ