దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 14, శుక్రవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు లో వాదనలు వింటున్న సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ముగ్గురు సభ్యులలో ఒకరైన జస్టిస్ ఆర్.భానుమతి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ కేసుపై ఉత్తర్వులు చదివి వినిపిస్తున్న క్రమంలో జస్టిస్ ఆర్.భానుమతి అస్వస్థత కారణంగా సొమ్మసిల్లారు. దీంతో వెంటనే కోర్టు సిబ్బంది ఆమెను ఛాంబర్కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆమె తేరుకున్నారు. కొద్దీ సమయం తర్వాత ఆమె స్పృహలోకి రావడంతో వైద్యులు చికిత్స అందించారు. జస్టిస్ భానుమతి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని, అయినప్పటికీ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మీడియాకు తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్రం వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ తేదీని ఉత్తర్వుల్లో వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. కాగా డెత్ వారెంట్లపై ఢిల్లీ ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17, సోమవారం నాడు తీర్పు వెలువరించనుండడంతో, ఈ అంశంపై తాము వేచి చూస్తామని విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్ చేస్తూ నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం ఉదయం కొట్టివేసింది.
[subscribe]