తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి టిఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, రైతు బంధును ఎన్నికల బంధుగా మార్చారని టిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల కోసం ప్రభుత్వం ఎంతో చేసిందని ప్రచారం చేస్తున్నారని, ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. లిక్కర్ ధరలు పెంచుకుంటూ పోతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పంటలకు ధరలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రతి సంవత్సరం 530 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామంటూ అసత్య ప్రచారంతో మభ్యపెడుతున్నారని, కానీ వాస్తవానికి 180 టీఎంసీలకు మించి ఎత్తిపోయడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడానికి బీజేపీ, టీఆర్ఎస్కు బీ-టీమ్గా వ్యవహరిస్తోందని అన్నారు. మై హోమ్ రామేశ్వరరావు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ కావడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారని రేవంత్ ఆరోపించారు. బీజేపీ నాయకులు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలో, ఉంచాలో అనే అంశంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
[subscribe]