దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2022 సంవత్సరానికి గాను నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులు/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ చెందిన వారు 10 మంది ఉండగా, 13 మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.
ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. అలాగే రాధేశ్యామ్ ఖేమ్కా (సాహిత్యం మరియు విద్య), కల్యాణ్సింగ్ (పబ్లిక్ అఫైర్స్) లకు కూడా మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే ఆర్ట్స్ విభాగంలో పద్మ విభూషణ్ అవార్డు పొందారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కు, సీరమ్ ఇన్స్టిట్యూట్ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు లభించగా, తెలంగాణకు ఒక పద్మ భూషణ్తో పాటు 3 పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించారు. 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య (కళలు), సకిని రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు) లకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇక ఏపీ నుంచి గరికపాటి నరసింహారావు (సాహిత్యం మరియు విద్య), గోసవీడు షేక్ హాసన్ (కళలు) (మరణానంతరం), డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం)లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. మరోవైపు హర్యానా నుంచి ఇటీవల ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు, తమిళనాడు రాష్ట్రం నుంచి సీనియర్ నటి షావుకారు జానకికి కూడా పద్మశ్రీ అవార్డులు లభించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ