నవంబర్ 26, 2008 నాడు ముంబయిలో జరిగిన పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ కోర్టు 11 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం చేశాడనే ఆరోపణలతో రెండు కేసుల్లో హఫీజ్ సయీద్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఒక్కో కేసులో ఐదున్నర సంవత్సరాలు చొప్పున మొత్తం 11 సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తున్నట్లు ఫిబ్రవరి 12, బుధవారం నాడు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గతకొంతకాలంగా ఉగ్రవాదులను ప్రోత్సహించడం, వారికీ నిధుల సహకారం అందించడం ఆపేయాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలోనే హఫీజ్ సయీద్ పై పాకిస్తాన్ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
మరోవైపు హఫీజ్ సయీద్ జైలు శిక్ష నిర్ణయాన్ని భారత్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా నిషేధించబడిన ఉగ్రవాది హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ కోర్టు శిక్ష విధించిందని మీడియాలో వార్తలు చూశాము. ఉగ్రవాదులకు సహకారాన్ని అందించేవారిని అణచివేయాలని ఎప్పటినుంచో అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ కు గుర్తుచేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పారిస్లో జరిగే గ్లోబల్ టెర్రర్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) కీలక సమావేశానికి కొద్ది రోజుల ముందు హఫీజ్ సయీద్ను దోషిగా తేల్చుతూ నిర్ణయం తీసుకోవడాన్ని గమనించాలని భారత్ భావిస్తుంది. ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటుగా మిగతా ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందో లేదో వేచిచూడాలని భారత్ భావిస్తుంది.
[subscribe]