తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 13, గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరం వెళ్లి ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని, మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పరిశీలించనున్నారు. లక్ష్మీ బ్యారేజ్ తో పాటుగా సరస్వతి, పార్వతి బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి వరకు ఉన్న నీటి నిల్వలకు సంబంధించి అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరపనున్నారు. అలాగే గోదావరి నదితో పాటు పరసర ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు. మరోవైపు కాళేశ్వరం పర్యటన నేపథ్యంలో ప్రగతి భవన్ లో సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసీ వీరవనిత, వనదేవత ‘సమ్మక్క’ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తుపాకులగూడెం బ్యారేజీకి ‘‘సమ్మక్క బ్యారేజీ’’ గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఇఎన్సీ మురళీధర్ రావును సీఎం ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు వుండడం వల్లే తెలంగాణలో అభివృద్ది అనుకున్న రీతిలో సాగుతున్నది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యి తెలంగాణ బీల్లల్లోకి కాళేశ్వరం సాగునీల్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నది. ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారినాయి. రానున్న వానం కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా అటునుంచి కాలువలకు మళ్లించే దిశగా ఇరిగేషన్ శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం అయ్యి, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
[subscribe]