జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 12, బుధవారం నాడు కర్నూలులో పర్యటిస్తున్నారు. విద్యార్థిని సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్యఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మధ్యాహ్నం 3 గంటల నుంచి కర్నూలులోని రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ర్యాలీ అనంతరం కోట్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రీతి తల్లి రోదన తనను నిస్సహాయతకు గురిచేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును అధికారంగా సీబీఐకి అప్పగించకపోతే మానవ హక్కుల కమిషన్ దృష్టికి మరోసారి స్వయంగా తీసుకెళ్తానని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తూ, సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని కోరారు. అలా జరగని పక్షంలో ఇదే కర్నూలులో ఒక రోజు నిరాహార దీక్షకు కూర్చుంటానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమండ్రిలో పెట్టిన దిశా పోలీస్ స్టేషన్ ను కర్నూల్ లో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. దోషులను వదిలేస్తే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుందని చెప్పారు.
అలాగే ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకూ కర్నూలు, ఎమ్మిగనూరులో జరిగే కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. కర్నూలులో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో సమావేశం కానున్నారు. అనంతరం జి+2 గృహాలను నిర్మించిన ప్రాంతానికి వెళ్తారు. గృహాలు పొందిన లబ్ధిదారులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత వీవర్స్ కాలనీని సందర్శించి చేనేత కార్మికులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
[subscribe]