పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకేసారిగా జరగనున్నాయి. 29 బిల్లులు మరియు రెండు ఆర్థిక వ్యవహారాలు కలిపి మొత్తం 31 అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కోసం ఉభయసభల్లో అన్ని కరోనా ప్రొటొకాల్స్ అనుసరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముందుగా లోక్సభ ప్రారంభమైన అనంతరం ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఉపఎన్నికలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీల ప్రమాణస్వీకారం అనంతరం ఇటీవల కేంద్ర కేబినెట్ లో చేరిన కేంద్ర మంత్రులను, కేంద్ర సహాయ మంత్రులను పీఎం మోదీ సభకు పరిచయం చేశారు. చాలా మంది మహిళలు, దళితులు, గిరిజనులు మంత్రులుగా మారినందున పార్లమెంటులో ఉత్సాహం ఉంటుందని అనుకున్నానని ప్రధాని పేర్కొన్నారు.
ఈసారి వ్యవసాయ, గ్రామీణ నేపథ్యం మరియు ఓబిసి కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు కేబినెట్ లో స్థానం కల్పించబడిందని చెప్పారు. కాగా ప్రధాని ప్రసంగం ప్రారంభం కాగానే లోక్సభ కార్యకలాపాలకు ప్రతిపక్ష పార్టీల సభ్యులు స్లోగన్లతో అంతరాయం కలిగించారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్సభ మధ్యాహ్నం 2 వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అలాగే ఇద్దరు సిట్టింగ్ సభ్యులైన డాక్టర్ రఘునాథ్ మోహపాత్రా, రాజీవ్ సాతావ్ మృతికి నివాళులు అర్పించిన అనంతరం రాజ్యసభను కూడా ఒక గంట పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ