కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11, శనివారం నాడు కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ పొడిగింపుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ తెల్లటి వస్త్రంతో తయారు చేసిన మాస్క్ ధరించి పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా లాక్డౌన్ కొనసాగింపు అంశంపైనే కీలకంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దేశంలో కరోనా వ్యాప్తిపై తాజా పరిస్థితులను ముఖ్యమంత్రులకు వివరించగా, అనంతరం ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో పరిస్థితులు, లాక్డౌన్ పొడిగింపు అంశంపై తమ అభిప్రాయాల్ని ప్రధాని మోదీకి తెలియజేసినట్టు సమాచారం.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, కరోనా వైరస్ పై చేసే పోరాటంలో భాగంగా తాను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు 24×7 అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరైనా, ఏ సమయంలోనైనా తనకు ఫోన్ చేసి సమాచారంతో పాటుగా, సలహాలు కూడా ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పీఎం మోదీ పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ, తమిళనాడు, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగించాలని నిర్ణయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేసినట్టుగా సమాచారం. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ ఈ రోజు లాక్డౌన్ పొడిగింపు లేదా తర్వాత కార్యచరణపై కీలక నిర్ణయం తీసుకుని, ప్రకటించే అవకాశమునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu