ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో 36వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. అలాగే ఒలింపియన్స్ పీవీ సింధు, నీరజ్ చోప్రా, రవికుమార్ దహియా సహా పలువురు దేశ అగ్రశ్రేణి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చి జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. అలాగే దేశార్లో ప్రపంచ స్థాయి “స్వర్ణిమ్ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ”ని కూడా ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ మైలురాయి ప్రాజెక్ట్ దేశంలోని క్రీడా విద్యా రంగాన్ని మారుస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.
చివరిసారిగా జాతీయ క్రీడలు 2015లో కేరళలో జరగగా, మళ్ళీ ఏడేళ్ల తర్వాత క్రీడా సంబరం జరుగుతుంది. అయితే గుజరాత్ రాష్ట్రంలో జాతీయ క్రీడలు జరగడం ఇదే తొలిసారి. 2022, సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 12 వరకు జాతీయ క్రీడలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి దాదాపు 15,000 మంది క్రీడాకారులు, కోచ్లు మరియు అధికారులు 36 క్రీడా విభాగాల్లో పాల్గొననున్నారు. ఇప్పటివరకు జరిగిన జాతీయ క్రీడల్లో ఇదే అతిపెద్దదిగా నిలవబోతుండగా, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్కోట్ మరియు భావ్నగర్ వంటి ఆరు నగరాల్లో క్రీడా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY