ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం గుజరాత్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ముందుగా అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి గాంధీనగర్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వరకు ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. గురువారం నాడు వెలువడిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ మరియు గోవా రాష్ట్రాలలో బీజేపీ సంచలన ఫలితాలను సాధించి అధికారం చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో కూడా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే దిశగా 10 కిమీ మేర ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు పెద్దఎత్తున బారులు తీరారు.
ఇక గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొనన్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుజరాత్ బీజేపీ నేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. అనంతరం మెమ్నగర్ లోని జిఎండిసి గ్రౌండ్లో జరిగే గుజరాత్ పంచాయతీ మహా సమ్మేళన్ లో ప్రధాని పాల్గొంటారు. ఇక మార్చి 12, శనివారం నాడు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అలాగే సాయంత్రం అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ