ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ‘ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్’ కింద మురికివాడల నివాసితుల పునరావాసం కోసం నిర్మించిన 3024 కొత్త ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు ఢిల్లీలోని వందలాది కుటుంబాలకు పెద్ద రోజు అని, ఢిల్లీని ఆదర్శ నగరంగా మార్చడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు పెద్ద పాత్ర పోషిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఒక్క కల్కాజీ ఎక్స్టెన్షన్ మొదటి దశలోనే 3,000కు పైగా గృహాలను ఇప్పటికే సిద్ధం చేశామని, అతి త్వరలోనే ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఇతర కుటుంబాలు వారు కూడా కొత్త ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం వస్తుందని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం అందరి అభ్యున్నతి కోసం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ల బాటలో పయనిస్తోందని అన్నారు. దశాబ్దాలుగా దేశంలోని పాలనా వ్యవస్థ పేదరికాన్ని ప్రజల సమస్య అనే మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతుందని, అయితే నేటి ప్రభుత్వం పేదలకు చెందినదని, వారిని అలా వదిలేసే స్వభావం లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఇక ఢిల్లీలో 50 లక్షల మంది ఉన్నారని, వారికి బ్యాంకు ఖాతా కూడా లేదని ప్రధాని అన్నారు. దాంతో బ్యాంకింగ్ వ్యవస్థలో వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. దీనిని గురించి ప్రధాని వర్ణిస్తూ.. ‘వారు ఢిల్లీలో ఉన్నారు, కానీ ఢిల్లీ వారికి చాలా దూరంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితిని తమ ప్రభుత్వం మార్చిందని, వారికి బ్యాంకుల్లో ఖాతాలను తెరవడం ద్వారా ఆర్థిక సాధికారిత సమకూర్చామని అన్నారు. దీని ఫలితంగా వీధి వ్యాపారులతో సహా ఢిల్లీలోని పేద ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు లభించాయని తెలిపారు. అలాగే 50 వేలకు పైగా వీధి వ్యాపారులు ‘స్వనిధి పథకం’ కింద ఆర్థిక సహాయం పొందారని వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి సహా పలువురు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE