ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 5G సేవలను ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఆరవ ఎడిషన్ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఐఎంసీ ఎగ్జిబిషన్ను ప్రధాని వీక్షించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, 21వ శతాబ్దంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఈరోజు ప్రత్యేకమైన రోజు అని అన్నారు. నేడు 130 కోట్ల మంది భారతీయులు దేశం నుండి మరియు దేశంలోని టెలికాం పరిశ్రమ నుండి 5G రూపంలో అద్భుతమైన బహుమతిని పొందుతున్నారు. 5G దేశంలో కొత్త శకానికి తలుపు తట్టింది. ఇందుకు ప్రతి భారతీయుడిని అభినందిస్తున్నాను” అని ప్రధాని తెలిపారు. ఈ 5G ప్రారంభం మరియు టెక్నాలజీ మార్చ్లో గ్రామీణ ప్రాంతాలు మరియు కార్మికులు సమాన భాగస్వాములుగా ఉన్నారని ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. “గతంలో 1జీబీ డేటా ధర రూ.300 ఉండగా, ఇప్పుడు ఒక్కో జీబీకి రూ.10కి తగ్గింది. సగటున దేశంలో ఒక వ్యక్తి నెలకు 14జీబీ డేటాను వినియోగిస్తాడు. దీనికి నెలకు దాదాపు రూ.4200 ఖర్చు అయ్యే పరిస్థితితులు ఉండగా నేడు రూ.125-150 మాత్రమే ఖర్చవుతుంది. ఇందుకు ప్రభుత్వ ప్రయత్నాలే కారణం: అని ప్రధాని అన్నారు.
న్యూ ఇండియా కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దేశంగానే ఉండదని, ఆ సాంకేతికత అభివృద్ధి మరియు అమలులో భారతదేశం క్రియాశీల పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తులో వైర్లెస్ టెక్నాలజీని రూపొందించడంలో, దానికి సంబంధించిన తయారీలో భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తుందన్నారు. 2G, 3G మరియు 4G టెక్నాలజీల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడి ఉందని, అయితే 5జీతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని చెప్పారు. 5Gతో భారత్ మొదటిసారిగా టెలికాం టెక్నాలజీలో ప్రపంచ స్థాయిని నెలకొల్పుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక డిజిటల్ ఇండియా అనేది పేరు మాత్రమే కాదని, ఇది దేశ అభివృద్ధికి పెద్ద విజన్ అని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే, ప్రజలతో అనుసంధానం చేయడం ద్వారా పనిచేసే ఆ సాంకేతికతను సామాన్యులకు అందించడమే ఈ విజన్ లక్ష్యమని అన్నారు.
“మేము ఒకేసారి నాలుగు దిశలలో 4 స్తంభాలపై దృష్టి సారించాం. మొదటిది పరికరం యొక్క ధర, రెండవది డిజిటల్ కనెక్టివిటీ, మూడవది డేటా ఖర్చు, నాల్గవది మరియు ముఖ్యంగా, ‘డిజిటల్ ఫస్ట్’ ఆలోచన. ఎనిమిదేళ్ల క్రితం వరకు భారతదేశంలో మొబైల్ తయారీ యూనిట్లు రెండే ఉన్నాయి. ఈ సంఖ్య ఇప్పుడు 200కి పెరిగింది. 2014లో జీరో మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసిన మనం నేడు వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసే దేశంగా మారాం. ఇంటర్నెట్ వినియోగదారులు 2014లో ఉన్న 6 కోట్ల నుండి నేడు 80 కోట్లకు పెరిగారు. 2014లో 100 కంటే తక్కువ పంచాయతీలు ఉండగా, ఇప్పుడు 1.7 లక్షల పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానించబడ్డాయి. ఇక టెలికాం పరిశ్రమకు అనేక ప్రోత్సాహకాలు అందించబడ్డాయి మరియు 4G వంటి సాంకేతికతలకు పాలసీ మద్దతు లభించింది. ఇది డేటా ధరను తగ్గించింది మరియు దేశంలో డేటా విప్లవానికి నాంది పలికింది. ఇక ‘డిజిటల్ ఫస్ట్’ అనే అంశంపై, పేదలకు డిజిటల్ అంటే అర్థం అవుతుందా అని కొంతమంది ఉన్నత వర్గాలకు చెందిన వారు ప్రశ్నించారు. దేశంలోని సామాన్యుల అవగాహన, జ్ఞానం మరియు పరిశోధనాత్మక మైండ్ పై ఎల్లప్పుడూ విశ్వాసం ఉంది. దేశంలోని నిరుపేదలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు” అని ప్రధాని మోదీ తెలిపారు.
5G సేవల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మరియు టెలికమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి కె.రాజారామన్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY