కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 11, శనివారం నాడు కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ పొడిగింపుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నట్టు తెలుస్తుంది.
పలు రాష్ట్రాల్లో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో దేశంలో లాక్డౌన్ను మరికొన్ని రోజులు పాటు పొడిగించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే పరోక్షంగా కొన్ని సూచనలు చేశాయి. అలాగే తాజా పరిస్థితుల దృష్ట్యా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతూ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు మోదీ ఈ అంశంపై అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ లాక్డౌన్ పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కొన్ని రంగాలకు నియమ నిబంధనలతో సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నిత్యావసర వస్తువుల రవాణా మినహా రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఇప్పటిలాగానే ఆంక్షలు కొనసాగే అవకాశముంది. మరోవైపు లాక్డౌన్ పై ప్రధాని నిర్ణయం కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే ఒడిశా రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది.