తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాటికీ 471 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమందికి కరోనా సోకినా కూడా లక్షణాలు కనిపించడం లేదంటూ కొన్ని అధ్యయనాల్లో వెల్లడి కావడంతో బయటకు వచ్చే ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులను వినియోగించాలని ప్రభుత్వం పేర్కొంది.
ధరించిన మాస్కులను తొలగించిన తర్వాత చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. అలాగే వాడిన మాస్కులను బయటపడేయకుండా మూత కలిగిన చెత్తడబ్బాలోనే వేయాలని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో మాస్కులను ధరించడం తప్పనిసరిచేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.