ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచాయితీ రాజ్ దివస్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రధాని మోదీ ర్యాలీ వేదికకు దాదాపు 12 కిలోమీటర్ల దూరంలోని లాలియానా గ్రామంలో శక్తివంతమైన పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పేలుడు జరిగిన తీరుపై దర్యాప్తు ప్రారంభించారు. జమ్మూ శివార్లలోని బిష్నాలోని లాలియానా గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో వేకువఝామున 4-5 గంటల మధ్య అనుమానాస్పద పేలుడు సంభవించింది. ప్రధాని మోదీ ప్రసంగించనున్న ప్రాంతానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. కాగా కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు తర్వాత ప్రధాని మోదీ అక్కడ పూర్తిస్థాయిలో పర్యటించడం ఇదే తొలిసారి. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ తో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాదిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఇది సంభవించింది. అరెస్టయిన ఉగ్రవాదిని ట్రాల్ నివాసి షఫీక్ అహ్మద్ షేక్గా గుర్తించారు.
“ట్రాల్ నివాసి షఫీక్ అహ్మద్ షేక్ను అరెస్టు చేశారు. జమ్మూకు రావాలని జైష్ (ఉగ్రవాద సంస్థ) అతడిని ఆదేశించింది. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అతను తన ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులను ఉంచుకోవలసి వచ్చింది. వారు అతని ఇంటికి సమీపంలో ఉన్న భద్రతా దళ శిబిరంపై దాడికి వేచి ఉన్నారు” అని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్లోని 30,000 మందికి పైగా పంచాయతీ రాజ్ సంస్థ (PRI) సభ్యులు హాజరవనున్న బహిరంగ సభలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీ రాజ్ సంస్థ సభ్యులనుద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో సుమారు రూ. 20,000 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులను మోదీ ప్రారంభించనున్నారు. రెండు పవర్ ప్రాజెక్టులతో సహా కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో లబ్ధిదారులకు స్వామిత్వ కార్డులను అందజేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ