కర్ణాటక రాష్ట్ర మంత్రి, బీజేపీ కీలక నేత ఉమేష్ కత్తి (61) మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ముందుగా బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఉమేష్ కత్తి గుండెనొప్పితో కుప్పకూలిపోయిపోగా, కుటుంబసభ్యులు వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికి ఆయనకు పల్స్ లేదని, ఆయన కన్నుమూశారని వైద్యులు ధ్రువీకరించారు. ఉమేష్ కత్తి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు మరియు అటవీ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఉమేష్ కత్తి కర్ణాటకలోని బెళగావి జిల్లా హుక్కేరి నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2008లో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు జనతాపార్టీ, జనతాదళ్, జేడీ(యూ), జేడీ(ఎస్) పార్టీలలో కూడా కీలక పాత్ర పోషించారు. బసవరాజ్ బొమ్మై, బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్, జేహెచ్ పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మొత్తం ఐదు సార్లు మంత్రిగా పనిచేశారు. ఉత్తర కర్ణాటకను విభజనపై కూడా ఉమేష్ కత్తి పలుసార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉమేష్ కత్తి మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, కాంగ్రెస్ నేతలు, రాష్ట్రమంత్రులు, నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం బుధవారం నాడు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. ఉమేష్ కత్తి అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఉమేష్ కత్తి మరణంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “శ్రీ ఉమేష్ కత్తి జీ కర్నాటక అభివృద్ధికి గొప్ప కృషి చేసిన అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆయన మరణం బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం మరియు మద్దతుదారులతో ఉన్నాయి. ఓం శాంతి” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY