ఆంధ్రప్రదేశ్లో నేడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) ప్రారంభించినవేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్సార్ రైతుల సంక్షేమం కోసం ఉచిత కరెంటుతో పాటు పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులలో కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినవని, వాటి స్థానంలో నేటి అవసరాలకు అనుగుణంగా కొత్తగా బ్యారేజీలను కడుతున్నామని వివరించారు. దీనిలో భాగంగానే నిన్న సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్న నెల్లూరు మరియు సంగం బ్యారేజీలు నిర్మించడం జరిగిందని వెల్లడించారు.
అయితే ఈ బ్యారేజీలను చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి చేసిందని టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చేపట్టి పూర్తి చేయలేదని, దీనిపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని ప్రకటించారు. ఇక పోలవరం ప్రాజెక్టు అంశంపై కూడా మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ జాప్యానికి నాటి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే చేపట్టి పూర్తి చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని, అయితే చంద్రబాబు దానిని పూర్తి చేసామన్న క్రెడిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని కేంద్రానికి తెలిపారని అన్నారు. ప్రాజెక్టులో కీలకమైన కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు పూర్తిచేశారని ప్రశ్నించారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, ఎవరి హయాంలో అభివృద్ధి జరుగుతుందో వారికి తెలుసని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ