జనవరి 16, శనివారం నాడు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అయింది. దేశమంతటా కరోనా వాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి మొత్తం 3006 కేంద్రాలలో వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయింది. ఒక్కో కేంద్రంలో తోలిరోజున సుమారు 100 మంది లబ్ధిదారులకు వాక్సిన్ వేయనున్నారు. తొలిరోజున ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఐసిడిసి వర్కర్లతో సహా హెల్త్కేర్ వర్కర్లలో 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. దేశంలో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంగా అవతరించనుంది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశప్రజలందరికి అభినందనలు తెలియజేశారు. సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి చాలా సంవత్సరాలు పడుతుందని, కానీ తక్కువ వ్యవధిలో రెండు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ లు సిద్ధమయ్యాయని అన్నారు. అలాగే ఇతర సంస్థల వ్యాక్సిన్ అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని గుర్తు చేశారు. రెండు వ్యాక్సిన్ ల మధ్య ఒక నెల వ్యవధి ఉండాలని నిపుణులు చెప్పారని అన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని కొనసాగించడం పాటించాలని సూచించారు. ఇంత పెద్దస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చరిత్రలో ఎప్పుడూ నిర్వహించబడలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా మొదటి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయనున్నామని, ఇక రెండవ దశలో ఈసంఖ్యను 30 కోట్లకు చేరేలా లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ