సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్తా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. అనంతరం అక్కడ జరిగిన ఏక్తా దివస్ పరేడ్లో పాల్గొని ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికే గర్వకారణమని చెప్పారు. భారత దేశ సమగ్రతకు పటేల్ విగ్రహం ఒక చిహ్నమని, దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గదర్శకాలను అనుసరించాలని చెప్పారు. పటేల్ వ్యక్తిత్వమే మానవాళికి ఒక పవిత్రమైన సందేశమని కొనియాడారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ కల నెరవేరిందని మోదీ చెప్పారు. సర్దార్ పటేల్ కు అప్పుడు కాశ్మీర్ సమస్యను పరిష్కరించే అవకాశం ఇచ్చివుంటే, ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవి కాదని చెప్పారు. ఆయన కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని మోదీ వెల్లడించారు.
మరోవైపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజర్, తదితరులు ఢిల్లీ లోని పటేల్ చౌక్ వద్ద సర్దార్ విగ్రహాం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రారంభమైన ఈ పరుగు 1.5 కి.మీ వరకు సాగింది. జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో దేశంలో అంతర్భాగం చేయాలన్న సర్దార్ పటేల్ కల నేరవేరిందని అమిత్ షా చెప్పారు.
[subscribe]