సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గురుదాస్ దాస్గుప్తా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారు. కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్టోబర్ 31, గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గురుదాస్ దాస్గుప్తా మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా, రెండుసార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నికై సేవలందించారు. 1985 నుంచి 1994 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేసారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. 2004లో బెంగాల్లోని పంక్సురా నియోజర్గం నుంచి, 2009లో ఘాటల్ నుంచి ఆయన లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. గురుదాస్ దాస్గుప్తా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయుసీ) ప్రధాన కార్యదర్శిగా కూడ సేవలు అందించారు.
సీనియర్ నాయకుడైన గురుదాస్ మరణంపై సీపీఐ పార్టీ జాతీయ కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీపీఐ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గురుదాస్ దాస్గుప్తా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురుదాస్ దాస్గుప్తా మృతి పట్ల సంతాపం తెలిపారు. ప్రజలు, కార్మికుల సంక్షేమానికి గురుదాస్ దాస్గుప్తా ఎంతో సేవ చేశాడని పేర్కొన్నారు.