ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్ఏ) పర్యటన కోసం ప్రధాని మోదీ వాషింగ్టన్ డీసీ (సెప్టెంబర్ 22, 2021, స్థానిక సమయం) చేరుకున్నారు. యూఎస్ఏ ప్రభుత్వం తరపున డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మేనేజ్ మెంట్ అండ్ రీసోర్సెస్ టి.హెచ్.బ్రియాన్ మెక్కీన్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అలాగే వాషింగ్టన్ ఆండ్రూస్ ఎయిర్బేస్లో ప్రవాస భారతీయులు భారత జెండాలతో ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాన మోదీ అమెరికా పర్యటన సెప్టెంబర్ 22 నుండి 25 వరకు కొనసాగనుంది.
ప్రధాని అమెరికా పర్యటనలో అమెరికా నాయకత్వంతో ద్వైపాక్షిక సమావేశాలు, క్వాడ్ నాయకుల సమ్మిట్లో పాల్గొనడం, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగం వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. సెప్టెంబర్ 23న అమెరికాలోని వాషింగ్టన్ లో పలు అమెరికా కంపెనీల సీఈవోలతో ప్రధాని సమావేశం కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా భేటీ అవుతారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తో కూడా ముఖాముఖి చర్చలు జరుపనున్నారు. అలాగే సెప్టెంబర్ 24 న అమెరికా అధ్యక్షుడు జో బైడెతో వైట్ హౌస్ లో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. జో బైడెన్ తో ప్రధాని మోదీ మొదటిసారిగా వ్యక్తిగతంగా భేటీ కాబోతున్నారు. అదేరోజున జపాన్ ప్రధాని యోషిహిడో సుగాతో విడిగా సమావేశం కానున్నారు.
అనంతరం భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. ఆ సమావేశం పూర్తయ్యాక ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకుంటారు. సెప్టెంబరు 25న న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ లో ఉన్నత-స్థాయి విభాగం యొక్క జనరల్ డిబేట్ లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం భారత్ కు తిరుగు ప్రయాణమై, సెప్టెంబర్ 26న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ న్యూఢిల్లీకి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ