ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 28, శనివారం నాడు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శామీర్పేట సమీపంలోని కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ ను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. శనివారం నాడు సాయంత్రం ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ సంస్థ వద్దకు చేరుకొని ‘కొవాగ్జిన్’ పేరుతో తయారయ్యే కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని మోదీ పరిశీలించనున్నారు.
ముందుగా శనివారం మధ్యాహ్నం పూణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించి, అక్కడ ఉత్పత్తి జరుగుతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికాకు చెందిన కరోనా వ్యాక్సిన్ వివరాలను కూడా ప్రధాని మోదీ పరిశీలించనున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ప్రధాని పర్యటన కేవలం భారత్ బయోటెక్ సందర్శనకు మాత్రమే పరిమితం కానుంది. భారత్ బయోటెక్ సందర్శన అనంతరం ప్రధాని మోదీ వెంటనే ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ