పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. విశ్వాస పరీక్షలో సీఎం నారాయణస్వామి మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై సౌందరరాజన్ ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ముందుగా ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుదుచ్చేరి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. కాగా మెజార్టీ కోల్పోయిన సీఎం వి.నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 22, సోమవారం సాయంత్రం ఐదు గంటలలోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో బలపరీక్ష కోసం సోమవారం నాడు పుదుచ్చేరి శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచారు. ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి పుదుచ్చేరి శాసనసభలో 33 మంది సభ్యులున్నారు. అయితే ప్రస్తుతం సభలో బలం నిరూపణకు 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కు స్పీకర్ తో కలిపి 10, ఇద్దరు డీఎంకే సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకముందే సీఎం నారాయణ స్వామి సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో విశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటన చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి సీఎం నారాయణస్వామి నేరుగా రాజ్ నివాస్ కు చేరుకొని లెఫ్టినెంట్ గవర్నర్ కు రాజీనామాను అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ