విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితులకు పరిహారం అందించే విషయంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ఒక దుర్ఘటన జరిగాక బాధితులకు భవిష్యత్తు పట్ల భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత. లాలూచీ రాజకీయాలు చేసుకుంటూ పోతే ప్రజలు ఇలాగే రోడ్లెక్కుతారు. ఎల్జీ పాలిమర్స్ దగ్గరున్న వెంకటాపురం గ్రామస్థులు ప్రత్యేక ప్యాకేజీ కావాలని మొదటి నుంచీ అడుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు?. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో కంపెనీకి 5 కి.మీ. పరిధిలోని గ్రామాల ప్రజలందరూ నరకం చూసారు. వెంకటాపురం గ్రామంలో మరింత ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. అలాంటి గ్రామస్థులకు సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో ఎందుకు అవకాశం కల్పించలేదు? మీ గుట్టుమట్లేమైనా బయటపడతాయనా?. వెంకటాపురం గ్రామస్థులు కోరుతున్నట్టుగా గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. తాత్కాలిక ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలి. గ్రామంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలి. 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు సంస్థతో ఇప్పించాలని” చంద్రబాబు పేర్కొన్నారు.
మరోవైపు ఈ గ్యాస్ లీకేజ్ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో బాధితులకు పరిహారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.30 కోట్లను విడుదల చేసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర మంత్రులు కోటి రూపాయల నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. అలాగే వెంటిలేటర్పై చికిత్స పొందిన వారికి, అస్వస్థతతో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి, ఈ ఘటనలో ప్రాథమిక స్థాయి చికిత్స పొందిన వారికి, ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu