దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని ప్రకటించారు. అలాగే వ్యాక్సిన్ తయారీ కంపెనీలు నెలవారీగా విడుదల చేసే డోసులలో 50% కేంద్రప్రభుత్వానికి, మిగిలిన 50% డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు బహిరంగ మార్కెట్ కు ఇచ్చేలా అధికారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ధరలను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా బుధవారం నాడు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసుకు రూ.400 చొప్పున మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోసుకు రూ.600 చొప్పున కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను విక్రయించనున్నట్టు వెల్లడించింది. ప్రపంచంలో లభించే ఇతర కరోనా వ్యాక్సిన్ల కంటే తమ వ్యాక్సిన్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ సీ పూనావాలా ఒక ప్రకటన విడుదల చేశారు.
తమ సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్స్ లో 50 శాతం కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి, మిగిలిన 50 శాతం రాష్ట్రప్రభుత్వాలు మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు అందించనున్నట్టు సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. వచ్చే రెండు నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధిగమిస్తామని చెప్పారు. అలాగే కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ నాలుగైదు నెలలో రిటైల్ మార్కెట్లోనూ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ