ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వైన్ఫ్లూతో బాధపడుతున్నారని జస్టిస్ చంద్రచూడ్ ఈ రోజు కోర్టులో తెలిపారు. స్వైన్ఫ్లూ సోకే అంశంపై పరిష్కార మార్గాలను అన్వేషించడానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బాబ్డేతో న్యాయమూర్తులంతా సమావేశమై చర్చించారని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో పనిచేసే వారికి టీకాలు వేయడానికి ఆదేశాలు ఇవ్వాలని, స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సీజేఐని కోరినట్లు పేర్కొన్నారు.
స్వైన్ఫ్లూ బారినపడి న్యాయమూర్తులు అనారోగ్యానికి గురికావడం వలన తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ విచారణ జరుపుతున్న శబరిమల కేసు సహా మరో కేసు విచారణ కూడా ప్రభావితమయ్యాయని చెప్పారు. మరో వైపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బాబ్డేతో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దేవ్ సమావేశమయ్యారు. అనంతరం దుష్యంత్ మాట్లాడుతూ, స్వైన్ఫ్లూ వైరస్ వ్యాప్తిపై బాబ్డే ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. కోర్టులో పనిచేసే వారికీ టీకాలు వేసేందుకు వీలుగా ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
[subscribe]