హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశ నిర్మాణంలో భాగంగా మూడు కొత్త మార్గాలుకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాయదుర్గం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వరకు, లక్డీకాపూల్ నుంచి ఆర్జీఐఏ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు నూతన మార్గాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అందుకు గానూ డీపీఆర్ను కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోకి ప్రయాణికుల టికెట్ల ద్వారా రోజుకి కోటి రూపాయలు, అలాగే మెట్రో మాల్స్ నుంచి నెలకు రూ. 10 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు.
మరోవైపు తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వెళ్లే విధంగా లైట్ మెట్రో, మోనో రైల్ ప్రతిపాదనలను పరిశీలిన అంశంపై కూడా ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్రో ప్రాజెక్టు గురించి మూడు రోజులు సర్వే చేశామని తెలిపారు. తిరుమల ప్రాంతం మొత్తాన్ని రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్రకటించారని, ప్రభుత్వాలు చొరవచూపితే తిరుమలలో మెట్రో రైలు ప్రాజెక్టుకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లేలా మెట్రో ప్రాజెక్టుకు ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని, త్వరలోనే ఈ విషయంపై ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు.
[subscribe]