కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 23, సోమవారం నాడు ఉదయం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని కలుసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21 న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. సీబీఐ విచారణ అనంతరం నిందితుడిగా ఉన్న చిదంబరాన్ని జ్యూడిషయల్ కస్టడీ లో భాగంగా తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకులైన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ చిదంబరాన్ని పరామర్శించి కొద్దిసేపు ముచ్చటించారు. చిదంబరం కుమారుడు కార్తీ కూడా సోమవారం నాడు జైలులో ఆయనను కలిసి మాట్లాడారు.
ఈ సమావేశం అనంతరం చిదంబరం ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేసారు. ‘నా తరపున ట్వీట్ చేయమని నేను నా కుటుంబాన్ని కోరాను: శ్రీమతి సోనియా గాంధీ మరియు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ రోజు నన్ను కలిసినందుకు నాకు గౌరవంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలంగా మరియు ధైర్యంగా ఉన్నంత వరకు నేను కూడా బలంగా మరియు ధైర్యంగా ఉంటాను’ అని చెప్పారు. కక్ష్య సాధింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చిదంబరాన్ని అరెస్ట్ చేయించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇక చిదంబరం బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు త్వరలో విచారణ జరపనుంది.
[subscribe]