శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సే దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించబడింది. ఆయన మద్దతుదారులు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సేతో పాటు ఆయన రాజకీయ సహచరుడు నమల్ మరియు మరో 15 మంది మిత్రులు దేశం విడిచి వెళ్లకుండా కోర్ట్ ఈరోజు నిషేధం విధించింది. దేశాన్ని అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినందుకు మహింద రాజపక్సే మరియు ఆ దేశ అధ్యక్షుడైన అతని సోదరుడు గోటబయ రాజపక్సే వైదొలగాలని డిమాండ్ చేస్తూ వారాల తరబడి నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. శ్రీలంక ప్రధానమంత్రి పదవికి మహింద రాజీనామా చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది.
శాంతియుత నిరసనకారులపై సోమవారం నాటి మూక దాడులు, తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్న, విస్తృత విధ్వంసానికి కారణమైన ప్రతీకార హింసకు దారితీసిన ఘటనపై దర్యాప్తు చేయాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా ప్రస్తుతం శ్రీలంక తూర్పు తీరంలోని ట్రింకోమలీ నౌకాదళ స్థావరంలో మహింద రాజపక్సే ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన కార్యనిర్వాహక అధికారాలను చాలా వరకు వదులుకుని ఈ వారంలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తానని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న తరుణంలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన సోదరుడి స్థానంలో కొత్త ప్రధానిని నియమించనున్నారు. కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను నియమించాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ