జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన అంశాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై అక్టోబర్ 1వ తేదీ నుంచి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు తాజాగా ప్రకటించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటివరకు దాఖలైన పిటిషన్లపై మంగళవారం నుంచి విచారణ చేపడుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆగష్టు 28న కశ్మీర్ కు సంబంధించి దాఖలైన మొత్తం 14 పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్టికల్-370 రద్దుపై దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ఆ సమయంలోనే సీజేఐ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. అక్టోబర్ 1నుంచి ధర్మాసనం వాదనలు వింటుంది. ఆగష్టు 5వ తేదీన ఆర్టికల్-370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అనంతరం లోక్ సభ, రాజ్యసభ లలో ఈ బిల్లును ఆమోదించారు. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి, బిల్లును ఆమోదించారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడంతో కొందరు ఈ విషయంపై పిటిషన్లు దాఖలు చేసారు. ఆర్టికల్-370 రద్దును సవాల్ చేస్తూ మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేయగా, వీటన్నింటిపై అక్టోబర్ 1 నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనుంది.
[subscribe]