టీ20 ప్రపంచ కప్-2022 లో గ్రూప్-2 కు సంబంధించి సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. గ్రూప్-2 లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాంబ్వే జట్లు ఉండగా భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. మరోవైపు గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు చేరిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం భారత్, జింబాబ్వే మధ్య చివరి సూపర్-12 రౌండ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ విజయం సాధిస్తే ఇంగ్లాండ్ తో, లేకుంటే న్యూజిలాండ్ జట్టుతో భారత్ సెమీఫైనల్ ఆడనుంది. ముందుగా ఆదివారం గ్రూప్-2 లోని దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు 13 పరుగుల తేడాతో పరాజయం పాలై, సెమీస్ కు అర్హత సాధించకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. దీంతో జింబాబ్వే మ్యాచ్ తో గెలుపోటములతో సంబంధం లేకుండా గ్రూప్ 2లో ప్రస్తుతానికి 6 పాయింట్లతో ఉన్న భారత్ జట్టు నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సెమీ ఫైనల్స్కు అర్హత సాధించడం ఇది 4వసారి.
ఇక ఆదివారం బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడంతో సెమీఫైనల్కు అర్హత సాధించింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు ఇంటిముఖం పట్టింది. సూపర్-12 రౌండ్ గ్రూప్-2లో పాకిస్తాన్ 5 మ్యాచుల్లో మూడు విజయాలు, రెండు ఓటములతో 6 పాయింట్లు, +1.028 నెట్ రన్రేట్ సాధించగా, భారత్ ప్రస్తుతానికి 4 మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లు, +0.730 నెట్ రన్రేట్ సాధించి మొదటి రెండు స్థానాల్లో ఉండడంతో సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE