ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో టీమిండియా దారుణ పరాజయం పాలైంది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన రెండవ సెమీఫైనల్లో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఇండియాపై అద్భుత విజయం సాధించింది. తద్వారా ఆదివారం జరుగనున్న ఫైనల్లో పాకిస్థాన్తో తలపడటానికి సిద్ధమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా 168 రన్స్ చేయగలిగింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనింగ్ ద్వయం ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడింది. కెప్టెన్ బట్లర్, హేల్స్ ఇద్దరూ సునాయాసంగా బ్యాటింగ్ చేసి తమ జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. హేల్స్ 47 బంతుల్లో 86 పరుగులతో నాటౌట్గా నిలవగా.. బట్లర్ అజేయంగా 49 బంతుల్లో 80 పరుగులు చేశాడు. వీరి ధాటికి మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్కు విజయం చేకూరింది.
అంతకుముందు భారత్ ఆదిలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడంతో విరాట్ కోహ్లీతో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను నెమ్మదిగా ముందుకు కదిలించారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో రోహిత్ 28 బంతుల్లో 27 పరుగులు చేసి నిష్క్రమించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 14 పరుగులకే వెనుదిరిగాడు. అయితే కోహ్లీ, హార్దిక్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ 18వ ఓవర్లో అర్ధశతకం సాధించిన వెంటనే కోహ్లీ (50) ఔటయ్యాడు. ఆ తర్వాత పాండ్యా (63) చెలరేగి అర్ధశతకం చేయడంతో భారత్, ఇంగ్లాండ్ ముందు 169 రన్స్ లక్ష్యాన్ని ఉంచగలిగింది. అయితే టీమిండియా బౌలర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. దీంతో అవమానకర రీతిలో భారత్ ఇంటిదారి పట్టింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE