ఐర్లాండ్లో జరిగే రెండు మ్యాచ్ల టీ-20 సిరీస్కు భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఐర్లాండ్తో సిరీస్కు బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్ను నియమించారు. ఐపీఎల్లో కెప్టెన్గా అరంగేట్రం సీజన్లోనే ‘గుజరాత్ టైటాన్స్’ జట్టుకు టైటిల్ అందించడంలో కీలకంగా వ్యవహరించిన పాండ్యా ఇప్పుడు టీమ్ఇండియా కెప్టెన్గా ప్రమోషన్ అందుకున్నాడు. ఐర్లాండ్తో సిరీస్లో హార్దిక్ పాండ్యా భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈనెల 26, 28 తేదీల్లో ఐర్లాండ్లోని డబ్లిన్లో ఈ రెండు మ్యాచ్లు జరుగనున్నాయి.
కాగా ఐర్లాండ్తో టీ-20 సిరీస్ జరిగనున్న సమయంలోనే భారత్.. ఇంగ్లండ్తో క్రితం పర్యటనలో ఆగిపోయిన ‘ఐదో’ టెస్ట్ ఆడనుంది. ఈ క్రమంలో ద్వితీయ శ్రేణి జట్టుతో భారత్ బరిలోకి దిగనుంది. అలాగే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించి ఫైనల్కు చేర్చిన సంజూ శాంసన్కు మరోసారి అవకాశం లభించింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడి ఆకట్టుకున్న మహారాష్ట్ర బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం లభించింది. ఇక సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ను సెలెక్టర్లు ఈ సిరీస్కు కీపర్గా ఎంపిక చేశారు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులో చేరనున్నాడు.
బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, యజవేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ