మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ గురువారం శ్రీలంకతో రెండో మ్యాచ్ ఆడనుంది. తొలి వన్డేలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడంతో ఘన విజయం సాధించిన టీమిండియా జోరు మీదుంది. నేటి మ్యాచ్లో కూడా అదేవిధమైన ఆటతీరును ప్రదర్శించడం ద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డు సెంచరీతో ఫుల్ ఫామ్లో ఉండటం సానుకూలాంశం. అలాగే గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీలు సాధించడం టీమిండియాకు శుభపరిణామం. తన ఫేవరెట్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో రోహిత్ ఈరోజు మరింతగా చెలరేగే అవకాశం ఉంది. అయితే మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్లు భారీ స్కోర్లు సాధించాల్సి ఉంది.
ఇక, బౌలర్ల విషయానికొస్తే సిరాజ్ కొత్త బంతితో మొదటి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆరంభంలోనే వికెట్లు తీసి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. షమి, ఉమ్రాన్ మాలిక్ ఫర్వాలేదనిపించారు. దీంతో టీమిండియా నేటి మ్యాచ్కోసం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు శ్రీలంక విషయానికొస్తే.. తొలి మ్యాచ్లో భారీ ఛేదనలో కెప్టెన్ షనక ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు చేతులెత్తాశారు. 179/7తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు షనక భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఒత్తిడిని అధిగమిస్తూ సెంచరీ చేయడం తెలిసిందే. ఈరోజు కూడా షనక నుంచి జట్టు అదే తరహా ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన పేసర్ మదుశంక ఆడడం అనుమానంగా ఉంది. కాగా సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే శ్రీలంక నేటి మ్యాచ్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మ్యాచ్ మ. 1.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో ప్రసారం కానుంది.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహల్.
శ్రీలంక: నిస్సంక, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, అసలంక, ధనంజయ, షనక (కెప్టెన్), హసరంగ, తీక్షణ, కరుణరత్నె, రజిత, లాహిరు కుమార.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE