గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నై నగర శివారులోని తామరైపాక్కంలో గల వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరిగాయి. ముందుగా కుటుంబ సభ్యులు వారి సంప్రదాయం ప్రకారం అంతిమ క్రతువు నిర్వహించారు. తమ అభిమాన గాయకుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సినీ ప్రముఖులతో పాటుగా, అభిమానులు పెద్దఎత్తున వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా కొద్దిమందినే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తరపున జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియలకు హాజరై ఎస్పీ బాలు పార్థీవదేహానికి నివాళులర్పించారు. అలాగే తమిళనాడు రాష్ట్ర మంత్రులు, స్టార్ హీరో విజయ్, భారతీరాజా, దేవిశ్రీ ప్రసాద్, మనో సహా పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu