కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. అగ్రనేత రాహుల్గాంధీ కాళ్లు మంటలు పుట్టేలా తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ దేశంలో మోదీ గాలి వేగం తగ్గడం లేదనిపిస్తోంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర చేసినా, ఇప్పుడు న్యాయ యాత్ర మొదలుపెట్టినా.. మళ్లీ దేశంలో అధికారంలోకి వచ్చేది బీజేయే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే విపక్షాలన్నీ ఇండియా పేరుతో ఒక్కటి అయ్యాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యూహ రచనలను పన్ను తున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం వాటి హవా కనిపించడం లేదు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ.. స్వతంత్రంగా కూడా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా దక్షిణాదిలో బలం పుంజుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. కీలక రాష్ట్రాలను పార్టీకి చెందిన ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తూనే, ఆయా రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతలను స్థానికంగా ప్రజాబలం ఉన్న నాయకుల భుజస్కంధాలపై పెట్టాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణలో పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఆయన సారథ్యంలో సీనియర్ మంత్రులుగా ఉన్న నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. కర్ణాటక బాధ్యతలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు, కేరళ బాధ్యతలను స్థానిక నేతలు సుధాకరన్, సతీశన్లకు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కేరళ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఆయనకు అత్యంత కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను అధిష్ఠానం అప్పజెప్పింది. ఉత్తరాదిన కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకే బాధ్యతల్ని అప్పజెబుతూ ఢిల్లీ నుంచి నేరుగా పర్యవేక్షించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. సచిన్ పైలట్ను లోక్సభ ఎన్నికల వరకు రాజస్థాన్ రాజకీయాల నుంచి దూరం పెట్టాలని నిర్ణయించే, ఉద్దేశపూర్వకంగా ఆయనకు ఛత్తీస్గఢ్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు రాజస్థాన్లో పార్టీ గెలుపు బాధ్యత పూర్తిగా మాజీ సీఎం అశోక్ గెహ్లోత్ దే. ఎలాగైనా దక్షిణాదిలో 45కుపైగా సీట్లు గెల్చుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. సరిగ్గా వ్యూహరచన చేస్తే ఇది సాధ్యమేనని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.
తెలంగాణలో కనీసం 10 సీట్లు, కేరళలో గతంలో మాదిరిగా 15 సీట్లు, తమిళనాడులో 8, కర్ణాటకలో గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటే దక్కినప్పటికీ ఈసారి 15 సీట్లు సాధించాలని పథక రచన చేస్తోంది. తమిళనాడులో డీఎంకే గతంలో మాదిరి తమకు 10 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయని, వాటిలో కనీసం 8 గెలవాలని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. దీంతో పాటు ఉత్తరాదిన కూడా ప్రచారం చేసేందుకు రాహుల్గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకాగాంధీ, సచిన్ పైలట్లకు బాధ్యతలు అప్పగించాలని ఖర్గే భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ పునర్వ్యవస్థీకరణలో ప్రియాంకాగాంధీకి ఏ బాధ్యతలు ఇవ్వకపోవటం, సచిన్ పైలట్కు ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రం అప్పజెప్పడం ఇందుకు సంకేతమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారం, సంక్షోభ నివారణ, పొత్తుల్లో జోక్యం వంటి కీలక బాధ్యతలను కూడా ప్రియాంకకు అప్పగించాలని ఖర్గే యోచిస్తున్నట్లు సమాచారం.
దక్షిణాదిలో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఆధిపత్యానికి కాస్తయినా చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో పునరావృతం కావని, మెరుగైన ఫలితాలు లభిస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, బిహార్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో బీజేపీ గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుందని, ఈసారి ఆ పార్టీకి అన్ని సీట్లు లభించవని భావిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఇండియా కూటమి కనీసం సగం సీట్లు గెలుచుకున్నా బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చనేది కాంగ్రెస్ ప్లాన్. మరి ఆయా రాష్ట్రాల్లో అనుకున్న సీట్లను సాధిస్తుందా? ఎంత వరకు ఆ ప్లాన్ ఫలిస్తుంది అనేది వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ